పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఖదీజా తుల్ కుబ్రా షియా మసీదుపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడికి వ్యతిరేకంగా శనివారం జమ్మూకాశ్మీర్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో షియా వర్గీయులు భారీ సంఖ్యలో గుమిగూడి శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో “పాకిస్థాన్ ముర్దాబాద్” అంటూ నినాదాలు మిన్నంటాయి. ప్రార్థనలు చేసుకుంటున్న అమాయకులను చంపడం హేయమైన చర్య అని, పాక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసనకారులు మండిపడ్డారు.

