స్ట్రోక్ చికిత్సలో భారతదేశానికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. గుంటూరు న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎన్నికైన తొలి భారతీయ న్యూరాలజిస్టుగా ఆమె చరిత్ర సృష్టించారు. నాలుగు ప్రధాన ఖండాల గ్రూపులలో ఒకటైన ఆసియా-ఓషియానియా ప్రాంతానికి డా. విజయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్ట్రోక్ చికిత్స, పరిశోధన, ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.