హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం సామాన్య ప్రయాణికులపై స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికులందరూ మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లు ఉదయం నుంచే ప్రయాణికులతో నిండిపోయాయి. నగరంలో కీలకమైన ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడుతోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ గేట్ల వద్ద జనం భారీగా క్యూ కట్టారు. ప్లాట్ఫారమ్ల మీద కూడా నిలబడటానికి చోటు లేనంతగా రద్దీ పెరిగింది.

