ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలిన ఘటనలో ఇద్దరు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోగల కమాల్కోట్ సైనిక శిబిరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అధికారిక వర్గాల కథనం ప్రకారం.. శిబిరంలోని సైనికులు ఆయుధ పరికరాలను ఒకరి నుంచి మరొకరికి అప్పగిస్తున్న సమయంలో గ్రెనేడ్ అకస్మాత్తుగా పేలింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే సైన్యానికి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.