కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేశారు. సంప్రదాయ వస్త్రధారణలో తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం, నిర్ణీత ముహూర్తంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.