భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక విజయాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శుక్రవారం తెల్లవారుజామున చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక ద్వారా 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణతో పాటు వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహం కీలక సేవలు అందించనుంది.