జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కార్లు, జీపులు, వ్యాన్లకు సంబంధించిన ఫాస్టాగ్ల కోసం ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త ఫాస్టాగ్లకే కాకుండా, ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని, వినియోగదారులకు ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని NHAI తెలిపింది.

