విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మితమైన విలాసవంతమైన ప్యాలెస్ మళ్లీ రాజకీయ, పరిపాలనా చర్చలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రజా ప్రయోజనార్థం వినియోగించడంతో పాటు ఆదాయ వనరుగా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ కాలంలో నిర్మితమైన ఈ అద్భుత నిర్మాణాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదో సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొని ప్యాలెస్ వినియోగంపై సమగ్రంగా చర్చించారు.

